పంజాబ్ సరిహద్దులో భారీ శబ్దాలు, క్షిపణి శకలాల కలకలం!

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో క్షిపణి శకలాలు కనిపించడం కలకలం రేపింది. జేతువాల్, మఖాన్ విండి, పంధేర్ గ్రామాల పరిధిలోని పొలాల్లో ఈ క్షిపణి అవశేషాలను గుర్తించారు. 'ఆపరేషన్ సిందూర్' కొనసాగుతున్న సమయంలో, తమ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని, వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

జేతువాల్ గ్రామానికి చెందిన ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ, "భారీ పేలుడు శబ్దం వినిపించిన తర్వాత చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. మా గ్రామంలోని పొలాల్లో క్షిపణికి చెందిన ముక్కలు పడ్డాయి" అని తెలిపారు.

సమీపంలోని మఖాన్ విండి గ్రామస్థులు కూడా తమ పొలాల్లో రాకెట్ వంటి వస్తువుల శకలాలు పడి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించారు. ఈ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే సైనిక దళాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి.

మఖాన్ విండి సమీపంలోని ఒక పొలంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న లోహపు శకలం లభించింది. పంజాబ్ పోలీసులు ఈ శకలాలను గుర్తించిన విషయాన్ని ధృవీకరించారు. ఈ శకలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి దేనికి చెందినవి అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Prakash Singh
Punjab
Missile Debris
International Border
Jetwal
Makhanwindi
Pander
Operation Sindhur
India-Pakistan Border
Rocket Fragments

More Telugu News